విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమించి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సిద్దమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరికి, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి తెర లేచి ఏడాది అయింది.
విశాఖ పట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం…. ఈ ఉద్యమాన్ని తెన్నేటి విశ్వనాథం నాయకుడై ముందుండి నడిపించారు. తాటికొండ ఎమ్మేల్యే టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమ ఫలితంగా, నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ 1970 ఏప్రిల్ 10 విశాఖ పట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్ప నున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారపు ప్రణాళికలు మొదల య్యాయి. 1971 జనవరి 20న ఇందిరా గాంధీచేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10వేలకోట్ల రూపాయలతో 20 ఎకరాల భూమి నిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది. 1977 లో నిర్మాణం మొదలైంది. 1979లో రష్యాతో ఒప్పం దం కుదుర్చుకున్నారు. రూ.3897.28 కోట్ల అంచనా తో 3.4 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు. కానీ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురు కావడం, ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. నాటి సీఎం బ్రహ్మానంద రెడ్డి కృషికి 1980లో ఇందిరా గాంధీ చొరవ తోడై, ఫలితంగా 80 నుండి 1983 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం వేగం పుంజుకుంది. రష్యా తో సాంకేతిక ఒప్పందం చేశారు. 1980 నవంబరులో దస్తూర్ & కో సమగ్ర నివేదిక సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకు స్థాపన జరిగింది. 1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) ఉండి విడివడి RINL గా గుర్తింపు పొందినది.
వైజాగ్ స్టీల్ గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం భారతదేశం లోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, విశాఖ పట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియ ట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించ బడింది. 1987 డిసెంబరు నాటికి కర్మాగారం నిర్మాణం పూర్త య్యింది. 1990 సెప్టెంబరులో ఉత్పత్తి ప్రారంభ మైంది. అప్పటికి నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లకు చేరుకుంది.
1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి. నరసింహా రావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాడు. మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది. 1994లో మొదటి సారిగా రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేక పోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలిం ది. ఈ సందర్భంగా ఉక్కుకార్మిక సంఘాలు అనేక ఉద్యమా లు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఉక్కు వడ్డీలను ఈక్విటీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచశ్రేణి ఉక్కు కర్మాగారంగా నిలబడింది.
కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశ విదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయ బడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారత దేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 ఎం. టి గా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3ఎం. టి కి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ప్రథాన మంత్రి పాలనలో దాని ఉత్పత్తి సామర్థ్యం పెంచారు. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.