భారత దేశ ప్రాచీన సంస్కృతీ సభ్యతలకు నిలయంగా సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా, వేదవేదాంగ శాస్త్రాగమ, నృత్య గీత నాట్యాది సకల కళలయందు నిష్ణాతులైన ధార్మిక కార్యాదరణాసక్తులైన ప్రజానీకంతో, మరెచ్చటా కానరానన్ని ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్న పలు దేవాలయాల సముదాయం కలిగి, రాష్ట్రంలో సుప్రసిద్ధ ప్రాచీన పవిత్ర గోదావరి తీరస్థ తీర్థంగా, పుణ్య క్షేత్రంగా మిగుల ప్రాచుర్యం పొందింది నాటి అవిభక్త కరీంనగర్, నేటి నూతన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం. శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వరస్వాముల దేవాలయాలు, మసీదూ పక్కపక్కనే కలిగి అనాదిగా వైష్ణవ, శైవ, ముస్లిం మత సామరస్యానికి సాక్షీ భూతంగా నిలిచియుంచీ క్షేత్రరాజం. గంభీర గౌతమీనది తీరాన వెలసి, అలనాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతిబింబమై పౌరాణిక ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకుని దక్షిణ కాశిగా పేరెన్నిక గనుటకు మూలకారణమైనది ఈ క్షేత్రం లోని శ్రీరామచంద్ర స్థాపిత శ్రీరామలింగేశ్వరాలయం. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించిన నేపథ్యంలో, కైలాస మేగిన సందర్భంలో, నిత్యానందంలో మునిగి తేలుతూ, ఆ మహర్షి
రాకను గమనింపని పార్వతీ పరమేశ్వరులను గాంచిన భృగు మహర్షి, శివుడు లింగరూపులో ఉంటూ, ఎవరిచేత పూజింపబ డకుండునట్లు శాపమిచ్చెనని పురాణాలు విశదీకరిస్తున్నాయి. తన శాప విముక్తి పరమ శివుడు, మహా విష్ణువును గురించి ఘోర తపస్సు చేయగా రామావతారంలో, ధర్మపురి క్షేత్రంలో స్వయంగా తాను లింగాన్ని ప్రతిష్టించి, పూజించి శాప నిమోచనం కలిగించ గలనని మహా విష్ణువు వరమిచ్చినట్లు స్థానిక పురాణాలు స్పష్ట పరుస్తున్నాయి. రామావతారంలో దశరథుని ఆజ్ఞానుసారం వనవాస దీక్షలో, దండకారణ్యంలో సంచరిస్తూ, ధర్మపురి క్షేత్రానికి ఏతెంచిన శ్రీరాముడు అలనాటికే వెలసి యున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈశాన్యాన, సైకత (జసుల) లింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు, శ్రీరామునిచే స్థాపించ బడినందున శ్రీరామలింగేశ్వరుడని నామాండితుడై నట్లు స్థల పురాణం స్పష్టం చేస్తున్నది. ఆరవ శతాబ్దంలో స్థాపించబడి, ఎనిమిదవ శతాబ్దాంతం వరకూ వర్ధిల్లిన చాకుక్య రాజుల ప్రాభవంలో పునర్మించ బడిన రామేశ్వరాలయంలోని గణేశ విగ్రహములు అలనాటి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. క్రీ.శ.973 నుండి 1140 వరకు పాలించిన కల్యాం చాళుక్యుల వంశానికి చెందిన విక్రమార్క బిరుదాంకితుడుగు ఆరవ విక్రముని (1076-1126) నాటి శిలాశాసనం ఈ ఆలయంలో ఉంది. ఇందులో ఈ చాళుక్యరాజు పరమేశ్వర, రణ రంగభైరవ, మార్వల భైరవ, ఆయత గంధ వారణ, విక్రమాదిత్య బిరుదులతో ప్రశంసింప బడినాడు. శాలివాహన శకం 1168 పరాభవ నామ సంవత్సర కాలం నాటి కాకతి గణపతి దేవుని శిలాశాసనం రామేశ్వరాలయంలో పూర్వపు చాళుక్య స్థంభం పైనే చెక్కబడి ఉంది. గణపతి దేవుడు ఇచటి రామేశ్వర, చండికల అంగరంగ వైభోగములకు గావించిన కొన్ని దానములు శాసనములలో పేర్కొనబడినవి. చాళుక్య శైలిలో బొజ్జ ఎత్తుగా నుండి, సహజమైన ఏనుగు తలను కలిగి, మానవ రూపంలేని గణపతి విగ్రహం ఆలయ సముదాయంలో నుంది. శివాలయ శిఖర నిర్మాణంలో చాళుక్య శైలి ఉంది. శిఖరం చాపాకృతిని పోలి. కిందనుండి పైకి ఎక్కుపెట్టిన విల్లులా ఉంది. శిఖర సౌందర్యానికి పైన ఆమలకములు వృత్తకారంలో చుట్టూరా కలిగి, ఆంతకుపైన కలశం, తూర్పున శుక నాసం ఉన్నాయి. శుక నాసం చిలుక ముక్కు లాగ ముందుకు పొడుచుకు వచ్చిన గూడు, శిఖర నిర్మాణం ఉత్కళ శైలిలో, లింగరాజ స్వామి ఆలయం (భువనేశ్వర్) దేవాలయ శఖరాకృతిని పోలి ఉంది. ప్రవేశ మంటపం తర్వాత దూరంగా గర్భాలయంలో మొదట ముఖ మంటపం ఉండి. మధ్యన గల రంగ శిల ప్రాచీనంగా నర్తకీమణుల వేదిక, నేడు అది వల్ల బండ.తర్వాత చీకటిగా.నుండే అంత రాళం, అపైన గర్భ గృహం. అందు శ్రీరామచంద్ర స్థాపిత సైకత (జముక) లింగం, ముఖ మంటపము, ప్రవేశ మంటపము, గర్భ గృహములు, ఆలయ ప్రాంగణంలో దాటితే శివుని దర్శనం. అలయ ప్రాంగణంలో మూడు ద్వారాలకు ఆభిముఖంగా నల్లరాతితో నిర్మించిన ఆభరణాలు అధికంగా గల, పీఠంపై ఉబ్బెత్తు హారాలు గలిగి, కాకతీయ ఆల యాలలోవలె శిలాకృతులు, జిలుగు నగిశీలు, మెడలో గంటలు, మువ్వల పట్టి, మెడ పట్టెడలు, గంగడోలు, వంపు తిరిగిన మెడ, వృహణాలతో నందులు ఉన్నాయి. పైకప్పుపై అపురూపాలైన ఏక ముఖ ద్వి దేహ నందులు నాలుగు మూలల ఉండేవి. సాలహార పునర్నిర్మాణ సమయంలో కూల్చి వేయడం జరిగింది. దేవాలయం కప్పుకన్నా ఎ త్తుగా, నిటారుగా 15ఆడుగుల ఎత్తు ఉన్న ధ్వజ స్థంభం (విజయ స్థంభం) ఉంది. శివాలయ ఈశాన్య భాగాన గణపతికి ప్రత్యేక గుడి ఉంది. ఇది కూర్చోని ఉన్న భారీ విగ్రహం. చాళుక్యుల కాలం నాటి విగ్రహానికి కుడి చేతులో గద ఉంది, నాగభంధం కలదు .ఎడమ చేతిలో గండ్రగొడ్డలి వంటి ఆయుధం, ఎడమ కింది చేతిలో మోదకాలు (ఉండ్రాళ్ళు) ఉన్నాయి. చెవులు చేటంత విశాలంగా ఉన్నాయి. రెండు వీర గల్లుల
శిల్పాలున్నాయి. పదాతిదళపు వీరుడు శతృవులను చీల్చి చెండాడు తున్న దృశ్యం, ప్రాంగణం బయట నాగిని విగ్రహముంది. పైన నాగుల ఐదు పడగలతో కింద స్త్రీమూర్తి, చివర తోక, లేకుండా ఉంది. ఎనిమిది చేతుల మహిషాసుర మర్ధిని విగ్రహం ఉంది. అలాగే అపురూపాలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ లేదా వరాహ పురాణంలో చెప్పబడిన యోగీశ్వరి ఆదిగా సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ఓకే పీఠంపై చతురస్రాకార శిల్పమిది. ఇరు పార్శ్వా లలో గణపతి వీర భద్రుని విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన దైవత లింగం కాక, ముఖ మంటపంలో వాయవ్యాన కాశీ విశ్వనాథుడు
పేరుతో పూజలందుకునే 4 అడుగుల ఎత్తుగల లింగం ఉంది. దండకారణ్యంలో సంచరిస్తూ, ధర్మపురి గోదావరిలో స్నానమాచరించి, శివ పూజ చేసేందుకు, హనుమంతుని లింగం తెమ్మని కాశీకి పంపగా, ప్రతి ప్రతిష్టించే సమయానికి ఆంజనేయుడు రాని స్థితిలో, సైకత లింగ ప్రతిష్ట గావించారని, ఆలస్యంగా ఏతెంచిన హనుమ సేవలు వ్యర్ధం కాకుండా, హనుమల్లింగాన్ని ప్రతిష్ఠచేసి, ఆ లింగాన్ని పూజించాకే, గర్యాలయంలోకి వెళ్ళేలా నియమం శ్రీరాముడు ఏర్పరచారని స్థల పురాణం స్పష్ట పరుస్తున్నది. ఆలయంలో 13వ శతాబ్ధం కాలంనాటి చండిక విగ్రహం కలదు. ఈ విగ్రహంలో అమ్మవారు చక్రస్తని, త్రిశూల, ఖడ్గహస్త, మకుట ధారిణి, చతుర్భుజ, శూల ధారిణిగా ఉంది. కాశీ విశ్వనాథుని పక్కన ప్రాచీన పార్వతీదేవి శిల్పం, మహిషాసుర మర్ధిని, షణ్ముఖుడు (కుమార స్వామి), ఉమా మహేశ్వరులు విడివిడిగా నల్ల శిలపై మలచబడి ఉన్నాయి. ఆలయంలో విక్రమాదిత్యుని, గణపతి దేవుని, ప్రధాన ద్వార కడప ముందర, బంకుళ్ళలో, దక్షిణ ప్రవేశ ద్వార స్థంభం, నైరుతి దిశలో ప్రహారీగోడ బాహ్యాది ఆరు శాస నాలున్నాయి. చుట్టూ రథం తిరిగేంత ప్రాంగణం, 10 అడుగుల ప్రహారీ కలిగి ఉన్నదీ ఆలయం. చారిత్రిక నేపథ్యం ప్రకారం, క్రీ.శ.1309లో ఢిల్లీనేలిన అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ నాయబ్ కాపూర్, ఇందూరు (నిజామాబాద్ ) మీదుగా ధర్మపురి మార్గంలో కాకతీయుల పైకి దండెత్తి వెళ్ళిన సమయంలో క్షేత్రంలోని రామేశ్వర, నృసింహాలయాలు ధ్వంసం చేయబడినవి. క్రీ.శ.1332-1367 మధ్యకాలంలో తెలంగాణా లోని వెలమ వీరుల సాయంతో, ముస్లింల నుండి
దాస్య విముక్తి కలిగించిన ముసునూరి కాపయా మాత్యుని పాలనా కాలంలో, పరమహంస పరి వ్రాజకాచార్య నారాయణాశ్రమ స్వామి ఉభయ దేవాలయాలకు చేయూతనిచ్చి తిరిగి అర్చనాదు లకై కట్టుదిట్టం చేశారు. అబుల్ హసన్ తానాషా(1674-1687) మంత్రియగు మాదోభా నూజీ సూర్యప్రకాశ రావు మజుందార్ (మాదన్న మంత్రి) ఉభయ ఆలయాల అర్చనకు సహకరించారు. నాటినుండి స్థానిక దాతలైన విప్రవరుల, ఆర్యవైశ్యుల, భక్తుల సహకారంతో పూజా నైవేద్యాది విధివిదాన కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తూ, కొంతకాలం క్రితం దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలోనికి తీసుకో బడింది. ఫలితంగా లక్ష్మీనరసింహ దేవస్థానంలో అంతర్భాగమైంది. వివిధ ధర్మకర్తల మండలుల కృషితో, దాతల చేయూ తతో నిధులను ప్రోగుచేసుకుని ముఖ్యమంత్రి సర్వశ్రేయో నిధి ద్వారా ప్రత్యేక నిధులు పొంది దేవాలయ పునరుద్ధరణ, సాలహార నిర్మాణం, అమ్మవారు, నంది, కలష, నవగ్రహ విగ్రహ ప్రతిష్టలు పూర్తి చేసుకుని , శృంగేరి శంకరాచార్య బహూకృత ఆదిశంకర, శారదామాత మూర్తులను ఆలయంలో ప్రతిష్టిం చడం జరిగింది. శివరాత్రి, శివ కళ్యాణం, రధోత్సవం, గణపతి నవగ్రహ పూజలు, శంకర జయంతి, శరన్నవరాత్రుల ఉత్సవాలను, నరసింహ స్వామివారల బ్రహ్మోత్సవ వేడుకలలో అంత ర్చాగంగా ఉత్సవాలను ఈ ఆలయంలో ఏడా సాంప్రదాయ
రీతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అర్చకులు విశ్వనాథం, ప్రవీణ్ కుమార్, సిబ్బంది, ఏర్పాట్లు చేశారు.
ప్రాచీన శిల్పకళకు ప్రతిరూపం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES