ఒక విలక్షణమైన నటునిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కవిగా రచయితగా దర్శకుడిగా తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందారు రంగనాథ్ గా సుపరిచితులయిన తిరుమల సుందర శ్రీరంగనాథ్. అవకాశం చేతులోకి వచ్చీ, సమయాను కూలంగా లేక రెండు సినిమాలలో హీరోగా నటించే అవకాశం కోల్పోవడం, రెండు చిత్రాలలో నటించిన ఇరువురు హీరోలుగా దూసుకు వెళ్ళిన సంఘటనలను రంగనాథ్ పలు సందర్భాలలో వెల్లడించే వారు.
రంగనాథ్ కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్న వారు కారు. తాతగారి ఇంట్లో ఆయన పెరిగిన
వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగనాధ్ కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే భావించ గా, చిన్నతనంలో నాటకరంగం వైపు దృషి నిలిపి, అనేక నాటకాలలో వివిధ పాత్రలను వేసారు. అక్కడినుంచి సినీరంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది. తల్లి ప్రోత్సాహం కూడా తోడైంది.
రంగనాధ్ తల్లి జానకి గాయని కావాలనుకునే వారట. అదే టైమ్లో ఎస్.జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ కోరిక నెరవేరక పోవడంతో కొడుకు అయినా ఆర్టిస్టు కావాలనుకుంది.
దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో 1949లో జూలై 17న టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించిన రంగనాథ్, 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ చేశారు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్గా కొంతకాలం పనిచేశారు.
బాపు తీసిన అందాల రాముడులో రాముని వేషానికి అయాచితంగా , అనూహ్యంగా అవకాశం తలుపు తట్టింది. అదే సమయంలో గిరిబాబు ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకున్నారు. దానిలో నటిస్తున్న సమయాన హీరో అవకాశాలు తప్పిపోయాయి. రెండు సినిమాలు చేజారి పోయాయి. ‘ఇద్దరూ ఇద్దరే’లో కృష్ణంరాజు, నటించి పైకొచ్చారు. ‘భారతంలో అమ్మాయి’లో మురళీమోహన్ హీరోగా చేసి క్లిక్ అయ్యారని రంగనాథ్ పలు సందర్భాలలో చెపుతుండే వారు. అలా 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించారు.
ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించటం ఆయనను మహిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినీ రంగంలో వచ్చిన మార్పులు కారణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వచ్చాయి. దీంతో మరో మార్గం లేక విలన్ గా మారారు. ‘గువ్వల జంట’ సినిమాతో తొలి సారిగా ప్రతి నాయక పాత్రలో అలరించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. రంగనాధ్ పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్ తో పాటు, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన శాంతినివాసం సీరియల్ లోనూ కీలక పాత్రలో నటించారు.
రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. వీరు రచించిన కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పద పరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. సినీరంగంతో అనుబందాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్థాంతరంగా డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో ఆత్మ హత్యకు పాల్పడి లోకాన్ని వదిలి వెళ్లారు.
