ఎడతెరిపి లేకుండా కురుస్తున్న
భారీ వర్షాల కారణంగా, గోదావరి నది గణనీయంగా పెరిగింది. జులై మాసంలో విరామం లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోనికి భారీగా చేరిన ఇన్ ఫ్లో గణనీయంగా పెరగగా, తదనుగుణంగా ఇన్ ఫ్లో బట్టి అవుట్ ఫ్లో కొన సాగిస్తున్నారు. కడెం నుండి 700 అడుగుల గరిష్ఠ స్థాయికి గాను, 695 అడుగుల ఎత్తుకు నీటిని స్థిరంగా ఉండేలా క్రమానుగతంగా14గేట్లను ఎత్తడం ద్వారా గరిష్టంగా 2,58,000 క్యూసెక్కుల నీటిని ఉదయం నుండి వదిలారు.
అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి అదే క్రమంలో అధిక వరద నీటిని గోదావరి లోనికి వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరా సాగర్ ప్రాజెక్టుకు భారీగా చేరిన ఇన్ ఫ్లో బట్టి 1091 అడుగుల ఎత్తుకు గాను సరిచూసుకుని, ఉ దయం నుండి గరిష్టంగా 1,50,000 క్యూసెక్కుల నీటిని గోదావరి లోనికి వదిలారు.
కడెం వరద నీటిని గోదావరి నది లోనికి వదలడంతో, సదరు నీరు ధర్మపురికి క్రమానుగతంగా చేరి, నీటి మట్టం అనుక్షణం పెరుగుతోంది. గురు వారం రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా ధర్మపురి, ఇతర మండలాల వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించి, వరద పరిస్థితిని పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు చర్యలకై సూచనలు అందించి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ గుగుల యాస్మిన్ భాషా ఆదేశాల మేరకు సమాచారం అందుకున్న ధర్మపురి తహశీల్దార్ వెంకటేశ్, మున్సిపాలిటీ కమిషనర్ రమేష్, సీఐ రమణ మూర్తి, ఎస్ఐ దత్తాత్రి, తమ సిబ్బందిని సమన్వయ పరిచే విధంగా ఉపక్రమించి, అనుక్షణం సమాచారాన్ని ప్రాజెక్టుల అధికారుల ద్వారా తెలుసుకుని, ఉన్నతా ధికారులకు సమాచారం అందిస్తూ, గోదావరి నది ఒడ్డున మకాం వేసి, దేవస్థానం పక్షాన మైకులలో ప్రకటింప చేస్తూ, తీరవాసులను అప్రమత్తం చేసే చర్యలు గైకొన్నారు. రెవెన్యూ అధికారులు గోదావరి తీరాన గల సంతోషి మాత ఆలయం లోనికి నీరు చేరగా, భక్తుల స్నానాలను నిలిపి వేసి, నది ప్రవాహం వద్దకు ఎవరినీ వెళ్లనీయ కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి సమయానికి నదీ ఒడ్డున గల సంతోషిమాత ఆలయం దాటి, రామాలయం సమీపానికి
నీరు చేరగా, ఎస్ హెచ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తీర ప్రాంత ప్రజలను తరలించే చర్యలు గైకొన్నారు.
