ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శక నిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు. సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశారు. హాస్య రచయితగా గుర్తింపు పొందారు. సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశారు. ఆయన 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు. కాకినాడలో మద్రాసు ఆనందవాణి పత్రికలో సర్ఎడిటర్ గా పని చేశారు. కొన్నాళ్ళు రమణ గారింట్లో ఉన్నారు.
కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్ వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీ నటుడుగా తొలిసారి కనబడ్డారు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడు మూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్ చేశారు. రాధాకుమారి జన్మించినది విజయనగరంలో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు. 1958 నుండి 2008 వరకు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి, ఒక ఇమేజ్ ను సొంతం చేసుకొన్నారు. అలాగే నీతిచంద్రిక, హ్యూమరథం (రెండు భాగాలు), మల్లీశ్వరి (సినిమా నవల), రావి కొండలరావు నాటికలు, రావి కొండలరావు కథలు, నాగావళి నుంచి మంజీర వరకు తదితర పుస్తకాలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం, 2004 సంవత్సరానికి అ.జో-వి. భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం లభించాయి. జులై 28, 2020న 88ఏళ్ళ వయస్సులో తుది శ్వాస విడిచారు.
