భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. ఆలాంటి చేనేత రంగానికి, కార్మికులపై జరిగిన నిర్లక్ష్యం, నిరాదరణ గురించి అనునిత్యం తపించిన చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య. చేనేత కార్మికులను సంఘటితం చేసి, అహరహం ఎన్నో పోరాట రూపాలలో ప్రత్యక్షంగా పాల్గొని, వారి ఆత్మ బంధువు గా వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయిన నేత ఆయన. ప్రగడ కోటయ్య గుంటూరు జిల్లా, నిడుబ్రోలులో చేనేత వృత్తిగా గల ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915, జూలై 26న జన్మించాడు. 1931లో ఎస్ఎస్ఎల్సి స్కూలు ఫైనల్ ప్యాసయ్యాడు. కొంతకాలం బాపట్ల తాలూకా బోర్డులో ఉపాధ్యా యుడుగా చేసాడు. ఆక్స్ ఫర్డు విశ్వ విద్యాలయంలో భారతీయ చేనేత పరిశ్రమ పై పరిశోధన జరిపిన ఆచార్య ఎన్ జి రంగా సలహా మేరకు మద్రాసు లోని టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ చదివి అక్కడ సూపర్వైజర్ పని చేసాడు. 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రా మికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉద్యోగంలో చేరి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశాడు. 1952 నుంచి 1962 వరకు రెండు పర్యాయాలు, తర్వాత 1957 నుంచి 1972 వరకు ఎమ్మెల్యేగా, 1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అనంతరం 1990 నుంచి 1995లో మరణించేంత వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. 1974 నుంచి 1978 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసాడు. 1945లో ఏర్పడిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్య తలు నిర్వహించాడు. 70వ జన్మదినం సందర్భంగా చీరాలలో జరిగిన సభలో ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి, ఇతడికి ‘ప్రజాబంధు’ బిరుదునిచ్చి సత్కరించారు. కోటయ్య మరణాంతరం రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు ప్రగడ కోటయ్య పేరు పెట్టింది. మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యుని గా, ప్రదేశ్ కాంగ్రేశ్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేట్ సభ్యునిగా పదవీ బాధ్యతలు సమర్ధ వంతంగా ప్రగడ కోటయ్య నిర్వహించారు. 1937 జూన్లో నిడుబ్రోలులో గుంటూరు జిల్లాలో ఎన్.జి.రంగా, తాడిపర్తి శ్రీకంఠం, దామెర్ల రమాకాంతరావు, రామనాథం రామదాసు, పెండెం వెంకట్రాములు మొదలైన ప్రముఖ నాయకులు పాల్గొన్న చేనేత మహా సభను వెనుక వుండి నడిపించింది ప్రగడ కోటయ్యే. అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి. రాజగోపాలా చారి ముఖ్య అతిథిగా గుంటూరులో చెన్న రాష్ట్ర చేనేత మహాసభ వెనక కృషి ఆయనదే. 1941లో బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమిత థామస్ కమిటీని కోటయ్య గుంటూరు జిల్లాకు ఆహ్వానించి వంద పేజీల మెమొరాండాన్ని అందజేశాడు. చేనేత పారిశ్రామికులకు చాలినంత నూలు సరఫరా చేయాలని, నూలు ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలని నినదిస్తూ ఆందోళనలు చేపట్టాడు. 1950 వరకు పరిస్థితులలో మార్పు రాలేదు. దాంతో చేనేత కాంగ్రెస్ సమర శంఖం పూరించింది. అన్ని జిల్లాల్లో ఆకలి యాత్రలు, సత్యాగ్రహాలు పెద్దఎత్తున చేపట్టాడు. అయినా ఫలితం రాలేదు. దాంతో మద్రాసు నగరంలో 1950 ఏప్రిల్ 16 నుంచి జూన్ 30 వరకు 75 రోజుల పాటు కోటయ్య సత్యాగ్రహం నడిపాడు. దాదాపు పదివేల మంది చేనేత కార్మికులు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 75 రోజుల అనంతరం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హరేకృష్ణ మెహతాబ్ మద్రాసు వచ్చి చేనేత కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపాడు. మంత్రి ఇచ్చిన హమీలతో సత్యాగ్రహాన్ని విరమించాడు. 1952 మద్రాసు శాసనసభ ఎన్నికల్లో ప్రకాశం పంతులు, కిసాన్ మజ్ఞూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా చీరాల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎన్నికయ్యాడు. శాసన సభలో కోటయ్య వాక్పటిమను చూసిన ఆనాటి ముఖ్యమంత్రి రాజాజీ, కాంగ్రెసు పార్టీలో చేరితే మంత్రి పదవి అప్పగిస్తానని చెప్పినా, కోటయ్య నైతిక విలువలకే ప్రాముఖ్యతనిచ్చి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిన నిస్వార్థ నేత. 1953 తర్వాత చేనేత వర్గాల ప్రయోజనాల కోసం రేపల్లెలో సత్యాగ్రహం చేపట్టాడు. ఫలితంగా జైలు శిక్ష అనుభవించాడు. కనుంగో కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించాడు. చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగిం చేందుకు సహకార సంఘాలు ఒక మార్గంగా నమ్మాడు. చేనేత రంగంతో పాటు రైతులు, జిన్నింగ్, స్పిన్నింగ్, కాంపోజిట్ మిల్లులపై ఆమూలాగ్రం అధ్యయనం చేశాడు. ఆయన హయాం లోనే ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200 పైగా నూతన చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసారు. అసంఘటితంగా ఉన్న చేనేత రంగం అభివృద్ధికి వారు నేసి బట్టలకు సరైన గిట్టుబాటు ధర లభించడానికి కోటయ్య కృషి చేసాడు. చీరాల వద్ద 17 వేల ఎకరాలకు పైగా బంజరు భూములను పేదలకు పంపిణీ చేసే విషయంలో చీరార సముద్ర తీర ప్రాంతంలో సేద్యపు నీటి సౌకర్యం కల్పించడంలో చీరాల, నెల్లూరు, రాజమండ్రి పట్టణాలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలో కోటయ్య కృషి మరవ లేనిది. భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా స్రీలంక, బ్రిటన్, చైనా, హాంకాంగ్ తదితర దేశాలు సందర్శించాడు. కోటయ్య 1995 నవంబర్ 26న మరణించాడు.
