వాతాపి గణపతిం భజే అన్న కీర్తన వినని వారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. వాతాపి తోనే చాలామంది విద్వాంసులు తమ సంగీత కచేరీలను ప్రాంభించడం చూస్తాం. అయితే ఈ కీర్తన ముత్తుస్వామి దీక్షితుల విరచితమని చాలామంది సంగీత ప్రియులకు తెలియక పోవచ్చు.
ముత్తుస్వామి దీక్షితర్ (1775 – 1835) కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు. దీక్షితార్, త్యాగరాజ (1767 – 1847), శ్యామ శాస్త్రి (1762 – 1827) లను సంగీత త్రిమూర్తులుగా పిలుస్తారు.
కర్ణాటక సంగీతంలో దీక్షితార్ కుటుంబానికొక ప్రత్యేక స్థానం వుంది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరుగా చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈయన ‘అష్టోత్తర శత రాగ రత్నమాలిక’ అనే అతి పెద్ద కృతిని స్వరకల్పన చేసాడు. ఇది రాగయుక్తంగా ఆలాపనలతో పాడడానికి ఓ రోజు పైగా పడుతుందని అంటారు. అటువంటి సంగీత విద్వాంసుడింట, వార్షిక వసంతోత్సవ సమయం అయిన ఫాల్గుణ మాసంలో, రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్య దంపతుల సంతానంగా మార్చి 24, 1775లో పుట్టాడు. ముద్దు కుమారస్వామి దయవలన జన్మించిన ఆయనకు ముద్దుస్వామి దీక్షితర్ అని ఇతని తల్లిదండ్రులు పేరు పెట్టారు. ముద్దుస్వామి దీక్షితర్ కాలక్రమేణా ముత్తుస్వామి దీక్షితర్గా పిలువ బడ్డాడు. సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన పండితుడు. మొత్తం 500లకు పైగా కీర్తనలు రాసాడు. కర్ణాటక సంగీతంలో ఏడు ప్రాథమిక తాళాల్లో కృతులు చేసిన ఏకైక స్వరకర్త. వీరు డెబ్భై రెండు మేళకర్త రాగాలలో(ఇవి వేరే డెబ్భై రెండు మేళకర్త రాగాలు) కృతులు రచించారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ కలనల్ బ్రౌన్ సూచన మేరకు దీక్షితార్ ఇంగ్లీష్ బాణీలకు సంస్కృతంలో వచనాన్ని రాసిన ప్రతిభాశాలి.
హైదరాలీ అకృత్యాలతో తంజావూరు చుట్టుపక్కల వూళ్ళన్నీ ధ్వంసమయి పోతే, రామస్వామి దీక్షితార్ స్వస్థలమైన విరించిపురం వదిలి తిరువద మర్దూరు మకాం మార్చారు. అక్కడ నుండి తిరువారూర్ వచ్చి స్థిరపడ్డారు. ముత్తుస్వామి దీక్షితార్ పుట్టింది తిరువారూర్లోనే. ముత్తుస్వామి వీణా విద్వాంసుడు. వీణా విద్వాంసుడు కావడం చేత గమకాల యొక్క గొప్పతనం దీక్షితార్ కూర్పులలో అద్భుతంగా కనిపిస్తుంది. ఆయన కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. కొన్ని కృతులు మణి ప్రవాలం (తమిళము, సంస్కృతాల సమ్మేళనం)లో కూడా రాయబడ్డాయి. “గురు గుహ” అనేది అయన మకుటం.
భక్తి శ్రద్ధలుగల గుణగణాలను బాల్యంలోనే అయన ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఆయన అభ్యసించాడు. సంగీతంపై వెలువడిన “వెంకటాముఖి” సుప్రసిద్ధ గ్రంథం “చతుర్థండి ప్రకాశికై” ను అధ్యయనం చేశాడు. కావలసిన మేరకు మన ధర్మ గ్రంథాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించ గలిగాడు. ముత్తుస్వామికి మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఫోర్ట్ సెయింట్ జార్జ్లో పాశ్చాత్య సంగీత కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కలనల్ బ్రౌన్ సూచన మేరకు దీక్షితార్ ఇంగ్లీష్ బాణీలకు సంస్కృతంలో వచనాన్ని రాసారు . పాశ్చాత్య సంగీతంతో దీక్షితార్ కుటుంబం అనుబంధం వల్ల లభించిన చాలా ముఖ్యమైన ప్రయోజనం వయోలిన్ను సాధారణ కచేరీ సాధనంగా స్వీకరించడం.
చిదంబరనాధ యోగి ముత్తుస్వామి దీక్షితర్ను కాశీకి తీసుకెళ్ళాడు. అక్కడ ఉపాసనా మార్గంలో ఉన్నపుడు, ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు. “శ్రీనాధాధి గరు గుహోజయతి” అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు ప్రథమావిభక్త్యంతంగా సంస్కృతంలో రచించి రాగం కూర్చాడు. తిరుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను అతడు రచించాడు. కాశీ లో గడిపిన కాలంలో హిందుస్తానీ సంగీతం ఆయన సృజనాత్మకత పై తీవ్ర ప్రభావాన్ని చూపింది, ఇది హిందూస్థానీ రాగాల నిర్వహణలో మాత్రమే కాకుండా, సాధారణంగా రాగాల చిత్రణలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తరువాత ప్రథమా విభక్తి మొదలుకొని సంబోధనా విభక్తి వరకు కల ఏడు విభక్తులతో ఏడు కీర్తనలు రచించాడు.
ఆయన కృతులలో నవగ్రహ కృతులు చాల ప్రసిద్ధి పొందాయి. ఈ కృతులను శ్రీ చక్ర ఆరాధనకు అంకితమిచ్చినప్పటికీ, వాటిని కమలంబ నవవర్ణ కీర్తనలు అంటారు. తిరువారూర్ మూల విరాట్టు దేవేరి అయిన కమలాంబని దీక్షితార్ జగజ్జననిగా కొలిచేవాడు. నవగ్రహ కీర్తనలు, నవవర్ణ కీర్తనలు ఆయన ప్రసిద్ధ సమూహ కూర్పులు. దీక్షితార్ రాగాలకు మాత్రమే కాకుండా తాళాలలో కూడా ప్రావీణ్యం కలవాడు.
హిందూస్థానీ సంగీతం నుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి ఆయన తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలైనవి. ఈయన యమునా కళ్యాణి (హిందూస్థానీ సంగీతానికి చెందిన యమన్) లో అనేక కీర్తనలను స్వరపరిచారు. వాటిలో రాగభావం, వైభవాల గొప్పతనం కోసం జంబుపతే మామ్ పాహి కీర్తన ఉదాహరణ.
రాగముద్ర, రాజముద్ర, వాగ్గేయకార ముద్ర మొదలైన అష్టాదశ ముద్రలు ఆయన కృతులలో కనిపిస్తాయి.
వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందా మృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి ఆయన ప్రముఖ రచనలు.
మదురై మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించాడు. అక్కడే అతడు “మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి” అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ధ్యాన యోగం, జ్యోతిష శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి దీక్షితుల కృతులలోని ప్రత్యేకతలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై అయన ఎన్నో కీర్తనలను రచించాడు. అక్టోబర్ 21, 1835 న ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుని తన
కృతులను నేర్పగా, వారు ఆయన సాంప్రదాయాన్ని కొన సాగించారు.
అసమాన వాగ్గేకారుడు ముత్తుస్వామి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES