ముకేష్ చంద్ మాథుర్ అంటే ఎవరు అని అడిగితే భారత దేశంలో దాదాపు దేశ ప్రజలు తెలియదనే అంటారు. హిందీ సినీ నేపథ్య గాయకుడు ముకేష్ పేరు తెలియని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. హిందీ సినీ గాయకునిగా సుపరిచితుడైన ముకేష్ పూర్తి పేరు ముకేష్ చంద్ మాథుర్ అంటే ఔనా అనే వారే తప్ప ఔను అనే వారు బహు అరుదుగా వుంటారు. హిందీ సినీ సంగీతానికి మరపురాని మధుర గీతాలను అందించిన విలక్షణ గాయకుడు ముకేష్. అతి పిన్న వయసులోనే లోకం వదిలి వెళ్లినా, జీవిత చరమాంకం వరకు ముఖేష్ పాడుతూనే వున్నారు. భౌతికంగా దూరమైనా, ఆయన పాడిన పాటలు అజరామరాలై, సంగీత ప్రియుల నోళ్ళలో దశాబ్దాలుగా నానుతూనే ఉన్నాయి. ముకేష్ (జూలై 22, 1923 – ఆగస్టు 27, 1976) 1950 నుండి 1970 ల మధ్యకాలంలో భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య ప్రముఖ గాయకుడు. ముకేష్, కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు. ఆయన పాటలు ఎన్నిసార్లు విన్నా, విసుగు రాకుండా ప్రతి సారీ ఆయన గాత్రంలో లీనం అవుతుండ డాన్ని బట్టి ముకేష్ ప్రత్యేకత స్పష్టం అవుతున్నది. జూలై 22, 1923న ఢిల్లీ నగరంలో జోనర్ నాద్ మాథుర్
చంద్రాణి దంపతులకు ఆరవ సంతానంగా జన్మించారు. తండ్రి ఇంజనీరుగా ఉద్యోగం చేసేవారు. ముకేష్ అక్క సుందర్ ప్యారికి సంగీతం నేర్పేందుకు ఒక పండిట్ వారి ఇంటికి వచ్చేవారు. దూరంగా ఉన్న గదిలో కూర్చొని ముకేష్ ఆ సంగీత పండితుడు తన అక్కకు సంగీతం ఎలా నేర్పిస్తున్నారో శ్రద్ధగా గమనిస్తూ తనలో తనే పాడుకుంటూ ఉండేవారు. అలా సంగీతం పట్ల ముకేష్ కు అభిమానం ఏర్పడింది. మెట్రిక్యులేషన్ పూర్తి కాగానే కాలేజి చదువుకు వెళ్లకుండా ప్రభుత్వ నిర్మాణ శాఖలో ఉద్యోగంలో చేశారు. ఉద్యోగం చేస్తూనే తన సంగీతాభిరుచికి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేశారు. హార్మోనియం వంటి కొన్ని వాద్య పరికరాలను ఎలా వాయించాలో శిక్షణ తీసుకున్నారు. ముకేష్ దూరపు బంధువు, సినీ నటుడు మోతిలాల్ కు ముఖేష్ స్వరం కొత్తగా, వినూత్నంగా తోచింది. తండ్రి అనుమతితో ముకేషు బొంబాయి తీసుకెళ్లి పండిట్ జగన్నాథ్ ప్రసాద్ వద్ద సంగీత పాఠాలు నేర్పించారు. ఆ సంగీత పండిట్ వద్దకు హిందీ సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు వచ్చిపోతూ ఉండేవారు. దర్శకుడు వీరేంద్ర దేశాయ్ ముఖేశ్ ను చూసి 1941లో నిర్దోష్ అనే సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. ముకేష్ సరసన నళిని జయవంత్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ముకేష్ ఒక గాయకుడి పాత్ర. నీలకంఠ తివారి పాట రాయగా, అశోక్ ఘోష్ స్వరపరచిన ‘దిల్ హి బుఝ హువా హెూ తో ఫసి- యే-బహార్ క్యా’ అనే పాటను ముకేష్ తొలిసారి పాడారు. రెండవ సినిమా వి.సి. దేశాయ్ నిర్మించిన ‘ఆదాబ్ అర్’లో కూడా నళిని జయవంత్ సరసనే హీరోగా ముకేష్ నటించారు.
తర్వాత రామ్ దర్యాని దర్శకత్వంలో వచ్చిన ‘దుఃఖ్ సుఖ్’ (1942 సినిమాలో హీరోగా సితారాదేవి సరసన నటించారు. ఖేమ్ చంద్ ప్రకాష్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సితారాదేవితో కలిసి రెండు యుగళ గీతాలు పాడారు. ‘అబ్ దేర్ న కర్ సాజన్ ఫూలోం సే జో మిల్నా హై, మేరీ అటరియా పే ఆజావో పరదేశి పంచీ’ అనే ఈ రెండు పాటలు పాపులర్ అయ్యాయి. రాజకపూర్తో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత ‘ఆహ్’ సినిమాలో క్యారేజ్ డ్రైవర్ ముఖేష్ ఒక అతిథి పాత్రలో కనిపించారు. తర్వాత ముకేష్ నేపథ్య గాయకుడిగా స్థిరపడాలని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేశారు. గాయక నటుడు కె.ఎల్. సైగలు ముకేష్ వీరాభిమాని. నేపథ్య గాయకుడుగా పరిచయమైన తొలిరోజుల్లో సైగల్ పంధాను ముకేష్ అనుకరించే ప్రయత్నం చేసేవారు. నిజానికి సైగల్ ముఖేష్ పాడిన ‘దిల్ జల్తా హై’ పాటను విని ఆ కొత్త గళాన్ని హిందీ చిత్రసీమకు దొరికిన ఆణిముత్యంగా శ్లాఘించారు. దిలీప్ కుమార్, మహమ్మద్ రఫీని నేపథ్య గాయకుడుగా ఇష్టపడితే, ముకేష్ రాజపూర్ కు గాయకుడయ్యారు. తోటి గాయకుల గళాలతో పోలిస్తే ముకేష్ గొంతుక ప్రత్యేకంగా వుంటుంది. ఆ ప్రత్యేకత అభిమానుల్ని ఆకట్టుకుని మైమరపించే సమ్మోహన అస్త్రంగా మారింది. నేపథ్య గాయకుడిగా శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో ముకేష్ 133 పాటలు పాడితే, కళ్యాన్ జీ ఆనంద్ జీ ఆధ్వర్యంలో 99 పాటలు పాడారు. ముకేష్ గెలుచుకున్న నాలుగు ఫిలింఫేర్ బహుమతుల్లో మూడు సినిమాలకు శంకర్ జైకిషనే సంగీత దర్శకులు కావడం విశేషం. అవి ‘సబ్ కుచ్ సీఖా హమ్ ‘ (అనారి – రాజకపూర్), ‘సబ్ సే బడా నాదాన్ వహీ హై’ (పెహచాన్ –మనోజ్ కుమార్), ‘జై బోలో బేయిమాన్ కి’ (బేయిమాన్- మనోజ్ కుమార్), ‘కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతా హై’ (కభీ కభీ — అమితాబ్ బచన్) పాటలు. 1974లో సలీల్ చౌదరి సంగీతం సమకూర్చిన ‘రజనీగంధ’ సినిమాలో ముకేష్ పాడిన ‘కహి బార్ యూ హి దేఖా హై’ పాటకు జాతీయ బహుమతి లభించింది. ముకేష్ మొత్తం మీద 1300 పాటలు పాడారు. ఒక నాటి మేటి క్రికెటర్లు భగవత్ సుబ్రహ్మణ్య (బి.ఎస్) చంద్రశేఖర్, సునీల్ మనోహర్ గవాస్కర్, సయ్యద్ కిర్మాణి, గుండప్ప విశ్వనాథకు ముఖేష్ పాటలంటే ఎంతో ఇష్టం. డ్రెస్సింగ్ రూమ్ లో స్ఫూర్తి పొందాలని వాళ్లు ముఖేష్ పాటలు లో గొంతుకలలో హమ్ చేసేవారు. అమెరికా పర్యటనలో వుండగా ముకేష్ కు గుండెనొప్పి వచ్చింది. డెట్రాయిట్ (మిచిగన్ రాష్ట్రం)లోని హెూటల్ రూమ్ లో ముకే ష్ తన 53వ (27 ఆగస్టు 1976) ఏట అసువులు బాశారు. “ముకేష్ భయ్యాకు వచ్చిన మంచి పాటలు నాకు రాలేదు. ఆయన యెంత అదృష్టవంతుడో’ అని కిషోర్ కుమార్ ఓ సందర్భంలో అన్నాడట. ముకేష్ అంటే రాజ్ కపూర్, రాజ్ కపూర్ అంటే ముకెష్ గా సాగింది వాళ్లిద్దరి అనుబంధం. అందుకే ముకేష్ మరణంతో, రాజకపూర్… ‘నా గొంతు మూగవోయింది. నా ఆరో ప్రాణం గంగలో కలిసింది’ అంటూ రోదించారు.
