హిందువులు, ముస్లిం సోదరులూ
సమిష్టిగా జరుపుకునే మొహర్రం ప్రత్యేకత సంతరించుకుంది. త్యాగానికి, మహోన్నత సనాతన సాంప్రదాయానికి, మత సామరస్యానికి ప్రతీక మొహర్రం వేడుక. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం ‘మొహరం’. ధర్మసంస్థాపన లక్ష్యంగా, నమ్మిన సిద్ధాంతాల కోసం
పలువురు ప్రాణాలర్పించిన మాసం
మొహర్రం. ధర్మసంస్థాపనార్ధం హజ్రత్ ఇమామ్ హుస్సేన్, హసన్ లు తమ ప్రాణాలను అర్పించి వందల సంవత్సరాలు గడిచినా అమరవీరుల త్యాగాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ, అమరుల త్యాగశీలతకు జోహార్లను ఆర్పించడం సత్సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు. మొహర్రం మాసమంటే రక్తపు టేరులతో ఎర్రబారిన కర్బల మైదానం ముస్లిం సోదరుల కళ్లలో సజీవంగా సాక్షాత్కరిస్తుంది. ధర్మాధర్మాలకు జరిగిన సంఘర్షణ ఫలితమే కర్బల దుర్ఘటనగా ముస్లింలు భావిస్తారు. ఇస్లాం మత స్థాపకుడు ప్రవక్త మహమ్మద్ పరమపదించిన
అనంతరం సమ సమాజ స్థాపన కోసంప్రజాస్వామ్య పద్ధతిలో, సౌదీ అరేబియాలో తమ ప్రతినిధిని ఎన్నుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. తదనుగుణంగా మదీనా రాజధానిగా గల రాజ్యానికి హజ్రత్ అబూబకర్ తొలి ఖలీఫాగా ఎన్నుకొనగా, అనంతరం హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్ హజ్రత్ అలీలను ఖలీఫాగా ఎన్నుకున్నారు. వీరి పరిపాలన సమయంలో న్యాయం, ధర్మం నాలుగు పాదాలపై
నడిచాయని చెపుతారు. ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానత్వం వెల్లి విరిసిందంటారు. ఐదవ ఖలీఫాగా ప్రజలు ఇమాం హుస్సేన్ తమ ప్రతినిధిగా ఎన్నుకోగా, సిరియా ప్రాంతానికి గవర్నరుగా ఉన్న హజ్రత్ మివాయా అధికార దాహంతో ఖలీఫా పదవిని ఆశించి
పోటీపడగా, ఇరువర్గాల మధ్య యుద్ధానికి నాంది పలికింది. యుద్ధ పరిణా మాలను గ్రహించిన హుస్సేన్, రక్తపాత నివారణకై రణరంగం నుండి నిష్క్రమించి, ప్రజలు తమకు విశ్వాసంతో కట్టెట్టిన అధికారాన్ని త్యాగం చేశారు. పదవీకాంక్షాలోలుడైన మివాయ తన కుమారునికి పట్టం కట్టాలని ప్రజలపై ఒత్తిడి తెచ్చిన స్థితిలో, ప్రాణభయంతో ప్రజలు మివాయ కొడుకు యజీద్ రాజుగా గుర్తిస్తారు. అయితే ఈ చర్యలు ప్రజాస్వామ్య వాదులకు మింగుడు పడలేదు. తత్ఫలితంగా ప్రజలు రాజుకు ఎదురు తిరిగి ఉద్యమిస్తారు. ఉద్యమ నాయకత్వ బాధ్యతలను హజ్రత్ హుస్సేన్ కి అప్పగిస్తారు. ఇస్లాం నిబంధనల ప్రకారం ఏసమస్యకైనా చర్చలు సంప్రదింపులే పరిష్కార మార్గాలు కావడం మూలంగా, హజ్రత్ హుస్సేన్ సిరియా రాజధాని కుఫాకు సంప్రదింపులకై బయలుదేరి వస్తుండగా, రాజు యజీద్ విషయాన్ని తెలుసుకుని హుస్సేన్ రాజధానికి వెళ్ళి చర్చలు జరిపితే తన అధికారానికి ముప్పు వాటిల్లక తప్పదని గ్రహించి, హుస్సేన్ ను అడ్డుకోవడానికి పెద్ద సైన్నాన్ని పంపుతాడు. మార్గ మధ్యలో కర్బల మైదానంలో యజీద్ సైన్యం ఎదురై హుస్సేన్ పరివారాన్ని అడ్డగిస్తారు. దీనితో ఇరువర్గాల మధ్య భీకరయుద్ధం జరుగు తుంది. హుస్సేన్ పరివారం శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడినా, కొంతకాలం యుద్ధం జరిగాక చివరకు హుస్సేన్ ఒక్కడే మిగులగా, మొహర్రం మాసం లోని పదో తేదీ శుక్రవారం హిజ్రీ 60వ సంవత్సరం నాడు హుస్సేన్ హోరా హోరీగా పోరాడుతున్న సమయంలో, సూర్యుడు అస్తమించే సమయం కావడంతో, కొంత వ్యవధి కావాలని అనుమతి గైకొనగా, శత్రువులు అదే అదనుగా భావించి, నమాజ్లో భాగంగా సిజ్జా చేస్తుండగా బాణాలతో దారుణంగా హతమార్చి, తలను మొండెం నుంచి వేరు చేసి, చేతులు ఖండించి బాణాలకు, బరిసెలకు తగిలించుకుని నాట్య విన్యాసాలు చేశారు. అట్టిరోజును ఇస్లాం మతస్తులు త్యాగ దినంగా పరిగణించి మొహర్రం జరుపు కుంటారు.ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు. ముహర్రం నెలను, “షహీద్ ” (అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు. తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపు కుంటారు. మొహర్రం వేడుకలు వారం రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి.
