“లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం”… రెండు చేతులలో మాలలను ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మిీ రూపంలో అమ్మవారు దర్శన మిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ దేవి.
లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఆమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఆమె త్రిదేవతలలో ఒకరు. ఆమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించ బడుతుంది.
మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె ‘నిత్యానపాయిని’ లక్ష్మీ నారాయణులు వేరు వేరు కాదని చెప్పబడింది.
సృష్ట్యాదిలో దేవి… సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో ఉంది. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు.
భృగు మహర్షి భార్య ఖ్యాతి. ఆమె పుత్రికా సంతానం కోసం తపస్సుచేస్తే ఆదిపరాశక్తి అంశతో ఆమె భార్గవిగ జన్మించింది. లక్ష్మీ దేవి… స్వారోచిష మన్వంతరంలో – అగ్ని నుంచి; ఔత్తమ మన్వంతరంలో “స్వచ్ఛమైన గాలి నుంచి; తామస మన్వంతరంలో – భూమి నుంచి; రైవత మన్వంతరంలో – బిల్వం నుంచి; చాక్షుష మన్వంతరంలో – సహస్రదళ పద్మం నుంచి; వైవస్వత మన్వంతరంలో ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రంలో శుక్రవారం నాడు క్షీరసాగరం నుంచి ఉద్భవించిందంటారు.
దూర్వాస మహాముని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించగా, పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె ‘సముద్రరాజ కుమార్తి’ అయ్యింది.
క్షీరసాగర కన్యగా లక్ష్మీ అవతరణం ఒక సంకేతార్థంగా భావిస్తారు.
ఈ జగత్తు ఒక సాగరం. మానవులలో సద్గుణాలు, దుర్గుణాలను… దేవ దానవులుగా సంపద కోసం చేసే మథనమే క్షీరసాగర మథనం. క్షీరసాగరం అనేక సంపదలకు నిలయం. ఇలా
మథనంలో హాలాహలం వంటివి చేదు అనుభవాలు. మరింత పట్టుదలతో, విశ్వాసంతో అధికంగా సాధనచేస్తే, భగవంతుడు శివరూపంలో అనుగ్రహించి, సంపదలు సమకూరుస్తాడని, ఈ సంపదలను భగవదర్పితంగా స్వీకరించాలని సందేశం అందిస్తుంది పురాణ కథనం. అలాంటి భావమే క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీహరి చేపట్టడం.
ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్ర యుక్తంగానే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందని పండితులు చెబుతారు. శ్రీ రాముని ధర్మపత్ని సీతాదేవి జననం ఉత్తరా నక్షత్రంలో జరిగిందని వాల్మీకి రామాయణం చేపుతుండగా, ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ఉత్తర నక్షత్ర ద్వితీయ పాదంలోనే జరిగిందని కొందరు పండితుల ఉవాచ.
శ్రీలక్ష్మీ కారుణ్య రూపిణి. ఈ లోకంలో ఉన్నతమైనవి, మంగళకరమైనవి, ప్రకాశనీయ మైనవి ఘనమైనవి, పవిత్రమైనవి, అదృష్టమైనవి అయిన పదార్గాలన్నీ ఆ తల్లి కటాక్షం ప్రసరించడం వల్లనే ఏర్పడ్డాయని విశ్వసిస్తారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుంది. అందుకే
పలు రూపాల శ్రీలక్ష్మీ దేవి విష్ణువు అవతారాలకు అనుగుణంగా రూపు దాల్చినట్లు చెపుతారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలుమంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది.
లక్ష్మిని పలురకాలుగ ఆరాధిస్తున్నారు. ఆమె రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి వంటి రూపాల్లో పూజలు అందుకుంటూ ఉండగా, అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి పఠిస్తే భక్తులకు ప్రసన్నురాలు అవుతున్నదని పండితులు చెపుతారు. లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మీ. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.