“శ్రీ హనుమాన్ గురుదేవులు నా యెద పలికిన సీతా రామ కథ….నే పలికెద సీతా రామ కథ”… ఎమ్మెస్ రామారావు సుమధుర కంఠం నుండి జాలువారిన సుందరాకాండ వినని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. హనుమాన్ జయంతి, శ్రీ రామ నవమి నేపథ్యం లో, హనుమాన్ మండల దీక్షలు, రామ నవరాత్రుల సందర్భంగా ఎక్కడ విన్నా సుందరాకాండ విని పించడం సర్వ సాధారణమే. అంతే కాక, ఆంజనేయ, రామాలయాలలో నిరంతరం మైకుల ద్వారా రామా రావు గానం చేసిన సుందరాకాండ ప్రతిధ్వనించడం కద్దు.
మోపర్తి సీతారామారావు అంటే ఎవరో చాలామందికి వెంటనే స్ఫురించక పోవచ్చును. కాని ఎం.ఎస్.రామారావు అనగానే తెలుగు సినిమాల తొలి నేపథ్య గాయకునిగా సంగీతాభిమానులకు, పాత తరం సినీ ప్రేక్షకులకూ ఆయన గుర్తుంటారు. సుందరదాసు’ అన గానే ఆయన యావత్ తెలుగు ప్రజ లందరికీ సుపరిచితులు, సుప్రసి ద్ధులు. ఆయన రచించి, సంగీతం సమకూర్చి గానం చేసిన ‘సుందర కాండ’ గీతాలు యావదాంధ్ర దేశంలోనూ మారు మ్రోగాయి. మారు మ్రోగుతున్నాయి. ఇంకా మారు మ్రోగుతూనే ఉంటాయి. రామాయణంలోని మధురమైన ‘సుందరకాండ’ కథను, తేట తెలుగులో, మృదు మధురమైన శైలిలో ఆయన పాడిన తీరు అసమానం, అపూర్వం, అద్వితీ యం. ఇలా మూడు విధాలుగా స్వీయ రచన గావించి, సంగీతం సమకూర్చి, స్వయంగా గానం చేసిన అసమాన ప్రతిభాశాలి ఎమ్మెస్ రామారావుకు ముందు మరొక లేరనడం అతిశయోక్తి కాదు. ఆయనకు “సుందర దాసు” అనే బిరుదు ఉంది. గేయ రూపంలో రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము “ఎమ్మెస్ రామారావు సుందరకాండ” గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడా రు. ఆ రెండూ ఆయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చి పెట్టాయి.
ఎమ్మెస్ రామారావు (మోపర్తి సీతారామారావు) 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య, మంగమ్మ గార్లు సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు గారు పాటలు పాడుతుండేవారు. ఈయ న విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచు కున్నారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన అడవి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు.
1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా “ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా” అనే ఎంకి పాట పాడించా రు. ఆ చిత్రంలో కథా నాయకుని పాత్ర పోషించిన సి.హెచ్. నారాయణ రావుకు పాడారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. అలా తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్ట మొదటి నేపథ్య గాయకులుగా గుర్తింపు పొందారు.
తరువాత ఎమ్మెస్ దీక్ష, ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసులో నివసిం చిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకు న్నారు. కొన్ని పాటలు రాసి నల్ల పిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైన గ్రామఫోన్ రికార్డులు ఇచ్చారు. నీరాజనం చిత్రంలో “ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా” పాటలో ఎమ్మెస్ గొంతు వినిపించింది.
1963 సంవత్సరాంతంలో మద్రాసు వదిలి వెళ్లి, రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసా రు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన ఇండియన్ ఏర్ ఫోర్స్ లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హను మాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదిం చారు, తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ సుందరకాండ గేయ రచన చేశాడు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరా బాదులో తుది శ్వాస విడిచారు.
తెలుగు చిత్రసీమలో ప్రథమ నేపథ్య గాయకుడు ఎమ్మెస్
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES