భారత దేశంలో క్రికెట్ అంతగా ప్రాచుర్యం పొందని రోజుల్లోనే స్టైలిష్ క్రికెటర్ గా తెరపైకి వచ్చిన సాటిలేని మేటి హైదరాబాదీ క్రికెట్ లెజెండ్ ఎం. ఎల్.జయసింహ. పదిహేనేళ్ల వయసులోనే హైదరాబాద్ జట్టు తరపున ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఆడిన తొలి మ్యాచ్ లో తొంభై పరుగులు సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. క్రికెట్ ప్రపంచంలో “కలివేటెడ్ స్టైలిస్ట్’గా గుర్తింపు పొందిన ఎం.ఎల్.జయసింహగా చిరపరిచితులైన మోటగానహళ్ళి లక్ష్మీనరసు జయసింహ సికింద్రాబాద్ లో 1939 మార్చి 3న జన్మించాడు. అయన చదువు సంధ్యలన్నీ ఇక్కడే సాగాయి, హైదరాబాద్ జట్టు తరఫునే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్…. ఇలా అన్ని అంశాల్లోనూ రాణించి ఆల్ రౌండర్గా సత్తా చాటుకున్నాడు. క్రికెట్లో ఇప్పటి రికార్డులతో పోల్చి చూస్తే జయసింహ రికార్డులు పెద్దగా అనిపించక పోవచ్చు. అయితే, అప్పటి పరిస్థితుల్లో ఆయన సాధించిన రికార్డులు తక్కు వేమీ కాదు. అప్పట్లో ఆధునిక క్రికెట్ కోచింగ్ సాకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పటిలా అప్పట్లో క్రికెటర్లకు ఆకర్ష ఆకర్షణీయమైన ఆదాయావకాశాలు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో రాణించడం అంత తేలిక కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి మ్యాచ్లోనే తొంభై పరుగులతో శుభారంభం చేసిన జయసింహ, ఆ తర్వాత మద్రాస్, మైసూరు జట్లతో ఆడిన మ్యాచ్లలో సెంచరీలు కొట్టాడు. అదే సీజన్లో రంజీ మ్యాచ్ లలో పౌలర్గా కూడా రాణించి, ఇరవై వికెట్లు తీసి, 1959లో ఇంగ్లండ్ కు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించు కున్నాడు. లార్డ్స్ మైదానంలో తొలి అంతర్జాతీయ టెస్ట్ ఆడాడు. తొలి టెస్ట్ లో విఫలమైనా, ఆ తర్వాతి రెండు టెస్ట్ మ్యాచ్ లలోనూ రాణించి, క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
ఒక టెస్ట్ మ్యాచ్ లో వరుసగా ఐదురోజులూ బ్యాటింగ్ చేసిన తొలి క్రికెటర్ గా జయసింహ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ జయసింహ అయితే, ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్ రవిశాస్త్రి. ఆస్ట్రేలియా జట్టుపై 1960లో కలకత్తాలో ఆడిన మ్యాచ్ లో జయసింహ తొలిరోజు ఆట ముగిసే సమయంలో బ్యాటింగ్ ప్రారంభించాడు. రెండో రోజు ఇరవై పరుగుల వద్ద ఉండగా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి మళ్లీ బ్యాటింగ్ అవ కాశం వచ్చింది. నాలుగో రోజంతా బ్యాటింగ్ చేసి 59 పరుగులు చేశాడు. చివరిగా ఐదో రోజు 74 పరుగుల వద్ద ఔటయ్యాడు, రెండేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టుపై కాన్పూర్ లో ఆడిన టెస్ట్ మ్యాచ్ లో ఒక సింగిల్ రన్ కోసం తొందర పడి 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి నాళ్లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా ఉన్న జయసింహ, క్రమంగా ఓపెనర్గా ఎదిగాడు. ఓపెనర్గానే ఇంగ్లాండ్, శ్రీలంక జట్లపై సెంచరీలు చేశాడు.
వెస్ట్ ఇండీస్ పై 1970 – 71 లో చివరి టెస్ట్ సిరీస్ ఆడిన జయ సింహ, జూనియర్లకు మార్గదర్శిగా ఉండేవాడు. ఆటలో జయసింహ ఇచ్చిన సలహాలు విలువైనవని మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కొనియాడటమే ఇందుకు నిదర్శనం. మరో మాజీ కెప్టెన్ నవాబ్ మహమ్మద్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ (టైగర్ పటౌడీ) సైతం జయసింహ నాయకత్వంలో పలు మ్యాచ్ లు ఆడాడు. ‘లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ శైలిలో జయసింహనే గురువుగా పరిగణించేవాడు. క్రికెటర్ గా విరమించుకున్నాక కొన్నాళ్లు సెలెక్టర్ గా, శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు మేనేజర్ గా వ్యవహరించాడు. కొన్నాళ్లు కామెంటేటర్గానూ ఆటతో బాంధవ్యాన్ని కొనసాగించిన జయసింహ, 1998 మార్చి 8న లంగ్ కేన్సర్ తో సైనిక్ పురిలోని తన నివాసంలో కన్ను మూశాడు.
జయసింహ ట్రాక్ రికార్డును చూస్తే…
జయసింహ 39 టెస్టు మ్యాచులలో 2056 పరుగులు చేసి, 30.68 బ్యాటింగ్ సరాసరి సాధించాడు.3 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు సాధించి, 129 అత్యధిక స్కోరు సాధించాడు. అలాగే 2097 బంతులుబౌలింగ్ చేసి, 92.11బౌలింగ్ సరాసరితో 9 వికెట్లు సాధించాడు. 54 పరుగులు ఇచ్చి 2వికెట్లు తీసుకున్నట్లు, 27 క్యాచ్ లు పట్టినట్లు నమోదై ఉంది. అలాగే 245 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి, 37.44 బ్యాటింగ్ సరాసరితో 13,526 పరుగులు చేసి, 359 అత్యధిక స్కోరుతో 33 సెంచరీలు, 65 అర్ధ శతకాలు సాధించాడు. 37771 బంతులు వేసి, 431 వికెట్లు పడగొట్టి, 29.86 సరసరితో 3 మ్యాచుల్లో… ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు, 18 మ్యాచుల్లో… ఇన్నింగ్స్ లో 5వికెట్లు తీసి, 45పరుగులు ఇచ్చి 7వికెట్లు ఇన్నింగ్స్ లో తీసిన, 157 క్యాచ్ లు పట్టిన రికార్డు సొంతం చేసుకున్నాడు.