– మహిళల గౌరవానికి భంగం
– స్త్రీలను అగౌరవపరిచే వారికి మతం గురించి మాట్లాడే హక్కే లేదు :నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లక్ష్మీ, సరస్వతీ, దుర్గాదేవీలను పూజించే మన దేశంలో మహిళల గౌరవానికి భంగం కలుగు తున్నదని నోబెల్ బహుమతి గ్రహీత, బచ్పన్ బచావో ఆందోళన్ వ్యవస్థాపకులు కైలాష్ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలను అగౌరవపరిచే వారి కి మతం గురించి మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు తదితర మతాలకు చెందిన వారమని చెప్పుకునే అర్హత లేదన్నారు. శనివారం హైదరాబాద్లోని త్రిబుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కరోనా సమయంలో విధించిన తొలి లాక్డౌన్ సమయం లో మొదటి 15 రోజుల్లోనే తాము నిర్వహించిన సర్వేలో భయానక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఆ సమయంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (పిల్లల పట్ల లైంగిక వేధింపులకు సంబంధించినవి) 90 శాతం పెరిగాయని తెలిపారు. దయగల నాయకత్వం ప్రపంచపు తక్షణావసరమని కైలాష్ సత్యార్థి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాజకీయ, మత తదితర రంగాల్లో కరుణ కలిగిన వారు నాయకులుగా ఉండాలని సూచించారు. ప్రజల పట్లనే కాదు… వారిని నమ్మిన వారి పట్ల కొంత మంది అలాంటి దయను కనబరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక విషయాలు ప్రపంచీకరణ చెందాయనీ, ప్రస్తుతం కరుణ ప్రపంచీకరణ కావాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక జబ్బులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దావానంలా పెరుగుతున్న ఈ వ్యాధులు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిపై ప్రతి ఏడాది దాదాపు ఒక ట్రిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ప్రతి ఏడాది 89 మిలియన్ల మంది డిప్రెషన్ (నిరాశ)తో చనిపోతున్నారని వివరించారు. ఇందులో సగం నిధులు విద్య, వైద్యం, ఇతర రంగాలకు ఖర్చు చేస్తే మానసిక జబ్బులకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టొద్దని సత్యార్థి ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. సమస్యలు, కష్టాల నుంచి వచ్చిన తాను ఎదిగిన ప్రస్థానాన్ని, నిరక్షరాస్యురాలైన తన తల్లి సంతానం పట్ల చూపించిన శ్రద్ధను ఆయన వివరించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాలు చూపించాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో ఎదిగిన వారు కచ్చితంగా నోబెల్ బహుమతిని పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రగతి పథాన ఉన్నా… దానికి సంబంధించిన డేటా కొన్ని కంపెనీలు, కొన్ని దేశాల నియంత్రణలోనే ఉందని తెలిపారు.