– మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు సీఎం ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాణనష్టం జరగకుండా చూడాలి. భారీ వరదల నేపథ్యంలో ప్రాజెక్టుల వద్దే ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ, పునరావాసం, వైద్యం, ఆహార సరఫరా వెంటనే చేపట్టాలి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులను గురువారం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ శాంతికుమారి సచివాలయం నుంచి అధికారులతో సమీక్షించారు. అవసరమైన చోటికి ఎన్డీఆర్ఎఫ్
బృందాలను వెంటనే తరలించారు. రాష్ట్ర స్థాయిలో వరదల పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన డీజీపీ, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులను పురమాయించారు.
ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించేటందుకు చర్యలు చేపట్టాలని సీఎం కోరారు. ఈ మేరకు ఇన్ఫ్లోను ముందస్తుగా అంచనా వేసి, గేట్లు ఎత్తివేస్తూ, వరద నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం, కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు సీఎం స్వయంగా ఫోన్లు చేసి, పరిస్థితులను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.మూసీ పరివాహక ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టేలా అధికారులను ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్కు సీఎం ఫోన్ చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంపల్లి గ్రామంలో ప్రజలను రక్షించేలా పరిస్థితిని సమీక్షించారు. ములుగు ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను సత్యవతి రాథోడ్ స్వయంగా పర్యవేక్షించి, అక్కడే బస చేస్తున్నారు. మరోవైపు మంత్రి హరీష్రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందుల తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాం గాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలి పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితుల ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్,డీ.ఆర్.ఎఫ్, ఫైర్ తదితర శాఖల ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సచి వాలయంలో వర్షాలు, వరద పరిస్థితులు, సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ అధికారులును నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.7997950008, 79979597 82 ,040-23450779 అనే నెంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొత్తగూడెం , హైదరాబాద్ లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ములుగు, వరంగల్లో ఒక్కొక్క బృందం ఉందని సీఎస్ తెలిపారు.