ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన మహోన్నత వ్యక్తి బాబా ఆమ్టే. సంఘ సేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా భావించ బడ్డారు. అమ్టే భారతీయ సామాజిక కార్యకర్త, లక్ష్య సిద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. సామాజిక సేవే పరమావధిగా ఎంచి, జీవితాన్ని అందుకు దారవోసిన ధన్య జీవి ఆయన.
కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్వన్ ఆశ్రమాన్ని స్థాపించి అయన కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన త్యాగశీలి. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన మహనీయుడు.
డిసెంబర్ 26, 1914లో మహా రాష్ట్రలోని వార్థా జిల్లా హింగన్ ఘాట్లో ఒక ఉన్నత దేశస్థ బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. బాబా అనేది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు. న్యాయ శాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.
బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. ఆనంద్వన్ వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించు కున్నాడు. కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించాడు. సమాజసేవ విషయంలో ఆనంద్వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్వన్ కై బాబాఆమ్తేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వ విద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథ శరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో 5000కు పైగా నివసిస్తున్నారు.
బాబా ఆమ్టే, గాంధీజీ సిద్ధాంతాలు
బాబాఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి పూర్తిగా ఆచరించిన మహనీయుడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించు కున్నాడు.
కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి అయన చేస్తున్న కృషికి బాబాఆమ్టేకు గాంధీజీ “అభయసాధక్” అనే బిరుదు ఇచ్చాడు. ఆ తరువాత బాబా ఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేషజీవితం అణగారిన వర్గాల కొరకే గడపడమే కాకుండా, వస్త్రధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించాడు. గాంధీజీ బ్రిటీష్ వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు.
తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటుపడి, తన ఆశయమే లక్ష్యంగా కృషిసల్పి,
2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమం ఆనంద్వన్లో బాబా ఆమ్టే 94 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు.
అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషిసల్పిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు. 1971లో భారత ప్రభుత్వపు పద్మశ్రీ అవార్డు, 1974లో మహారాష్ట్ర ప్రభుత్వపు దళిత్ మిశ్రా అవార్డు ,
1978 లో రాష్ట్రీయ భూషణ్ అవార్డు, 1979 లో జమన్లాల్ బజాజ్ అవార్డు, 1983లో అమెరికాకు చెందిన డామియెన్ డట్టన్ అవార్డు (కుష్టువ్యాధి పీడితుల కోసం కృషిసల్పిన వారికిచ్చే ప్రపంచంలో అత్యున్నత అవార్డు), 1985లో రామన్ మెగ్సేసే అవార్డు,
1985లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వపు ఇందిరా గాంధీ స్మారక అవార్డు ,
1986లో భారత ప్రభుత్వపు పద్మవిభూషణ్ అవార్డు, 1986 లో రాజారాంమోహన్ రాయ్ అవార్డు, 1988లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అవార్డు,
1988లో జి.డి.బిర్లా అంతర్జాతీయ అవార్డు, 1988లో ఫిక్కి అవార్డు,
1989లో అంతర్జాతీయ జిరాఫీ అవార్డు, 1990లో టెంపుల్టన్ అవార్డు, 1991లో రైట్ లివ్లీహుడ్ అవార్డ్ (ఈ అవార్డు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందింది), 1991లో ఆదివాసీ సేవక్ అవార్డు,
1992లో మహారాష్ట్ర ప్రభుతపు అంబేద్కర్ దళిత్ మిత్ర అవార్డు,
1997లో మహాత్మా గాంధీ చారిటేబుల్ ట్రస్ట్ అవార్డు,
1999లో గాంధీ శాంతి బహుమతి,
1999లో అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు, 2008లో భారత్వాసా అవార్డు లభించాయి.
