దేశంలో విద్య అభివృద్ధికి తొలి బాట వేసిన విద్యాధికుడు అబుల్ కలాం ఆజాదే. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. నవంబర్ 11న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపు కుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. ఆయన అసలుపేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కా నగరంలో జన్మించారు. ఆయన వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు/ మౌలానాల వంశం నుండి వచ్చారు. ఆయన తల్లి అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు గల ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారత దేశం నుండి మక్కా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.1890 లో అయన తమ కుటుంబంతో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించారు. ఆయన విద్య ఇంట్లో సాగింది. మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట అరబిక్, పెర్షియన్ తరువాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం నేర్చుకున్నారు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నారు. ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందారు. ఆయన దివ్య ఖురాన్ పై భాష్యం రాశారు. స్వయంగా కవి సాహితీవేత్త అయిన ఆయన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్‘ను రాశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అయిన విషయం ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాలలో, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించ సాగారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించారు.1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు. మౌలానా ఆజాద్, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయినారు. ఆయనను ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, 1946 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించారు.ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది. అంతేకాదు ఆయన పేరిట పలు విద్యాసంస్థలు కూడా నెలకొల్ప బడ్డాయి. అబుల్ కలాం మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వ విద్యాలయం సహా భారతదేశం అంతటా వివిధ కళాశాలలు మరియు విశ్వ విద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఆయన సేవలకు గుర్తుగా 2008లో భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును “జాతీయ విద్యా దినోత్సవం”గా నిర్ణయించింది.భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు, విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అంకిత భావంతో పనిచేశారు. చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాాణానికి జాతీయ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించారు. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారు. అలాగే ‘‘ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను పొందడం వ్యక్తి జన్మహక్కుగా పరిగణించాలి. లేదంటే పౌరులుగా తమ విధులను పూర్తిగా నిర్వర్తించలేరు‘‘ అని అబుల్ కలామ్ ప్రాథమిక విద్య గురించి వివరించారు. అంతే కాదు, ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో అనేక పథకాలను తీసుకొచ్చారు.ఆయన మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ (యుజిసి)ని విద్యా మంత్రిత్వ శాఖ 1953లో స్థాపించింది. అలాగే 1951లో అబుల్ నాయకత్వంలో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించ బడింది. ఆయన ఒక దూరదృష్టిగల వ్యక్తి, భవిష్యత్ సాంకేతిక నిపుణులను రూపొందించడంలో ఐఐటిల సామర్థ్యాన్ని నమ్ముతారు. “ఈ ఇన్స్టిట్యూట్ స్థాపన దేశంలో ఉన్నత సాంకేతిక విద్య మరియు పరిశోధనల పురోగతిలో ఒక మైలురాయిగా మారుతుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు” అని మౌలానా ఆజాద్ పేర్కొన్నారు.గాంధీజీ ఆయనను “భారత ప్లాటో” అని, గాంధీ , నెహ్రూ ఆయనను మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవాడు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
