చైతన్య సాయి పల్లవి ”లవ్ స్టోరీ” సినిమా టీజర్ ప్రేక్షకుల
ముందుకొచ్చేసింది. బ్యూటిఫుల్ ఎమోషన్స్ ను మరింత అందంగా, ఆహ్లాదకరంగా
తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ”లవ్ స్టోరీ” చిత్రాన్ని
రూపొందిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల 8 ని.లకు నాగ చైతన్య ట్విట్టర్
ద్వారా టీజర్ విడుదల చేశారు. ”ఈ ప్రయాణాన్ని మాలాగే మీరూ ఆస్వాదిస్తారని
ఆశిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు.
తమ కలల్ని నెరవేర్చుకునేందుకు, జీవితంలో అనుకున్నది సాధించేందుకు
పల్లెటూర్ల నుంచి నగరానికి వచ్చిన రేవంత్, మౌనిక ల కథే ”లవ్ స్టోరీ”.
కలలు వేరైనా ఈ ఇద్దరినీ ప్రేమ ఒక్కటి చేస్తుంది. రేవంత్, మౌనిక కలిశాక
సమాజం నుంచి ఎదుర్కొన్న సమస్యలేంటి, వాటిని అధిగమించి తమ గమ్యానికి ఈ జంట
ఎలా చేరింది అనే అంశాలు ”లవ్ స్టోరీ” మూవీలో ప్రధానాంశాలు కాగా…నాగ
చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడటం సినిమాలో కొత్తగా, హైలైట్
గా ఉండబోతున్నాయి.
టీజర్ చూస్తే ..జుంబా ఇన్ స్ట్రక్టర్ రేవంత్ పాత్రలో చైతూ కనిపించారు.
”జీరో కెల్లి వచ్చిన సార్ చాన కష్టపడతా, మంచి ప్లాన్ ఉంది”. అని చైతూ
చెప్పిన డైలాగ్ తో ”లవ్ స్టోరీ” టీజర్ ప్రారంభమైంది. మౌనిక పాత్రలో
సాయి పల్లవి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ..”జాబ్ గ్యారంటీగా
వస్తుందని అనుకున్నా నే, ఇక హోప్ లేదే” అని తన స్నేహితురాలితో చెప్పిన
డైలాగ్ చూపించారు. ”ఏందిరా వదిలేస్తవా నన్ను” అని మౌనిక రేవంత్ ను
అడగటం, ఇద్దరు కలిసి ఊరు నుంచి బయటకు పరుగెత్తుతూ వచ్చేయడం టీజర్ ను
పీక్స్ కు తీసుకెళ్లింది. ఈ పరుగులో సాయి పల్లవి చెప్పులు కూడా
వేసుకోకపోవడం చూస్తే, ఈ నిర్ణయం ఆమె అప్పటికప్పుడు తీసుకున్నట్లు
తెలుస్తోంది. ”లవ్ స్టోరీ” సినిమాలో 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని
సూపర్ హిట్ అయిన ”ఏ పిల్లా” పాటలోని ”ఆశ నిరాశల ఉయ్యాలాటలు” అని
వచ్చే బిట్ తో టీజర్ కనువిందుగా పూర్తయింది.
లవ్ స్టోరీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్
క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్,
పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల,
ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
